హైదరాబాదు లో పర్యావరణ అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య భవన్లో ఈ నెల 22 నుంచి 24 వరకు ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ కీ చాలెంజ్ టు సైస్టెనబుల్ డెవలప్మెంట్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జీహెచ్ఎంసీ, జలమండలి, జేఎన్టీయూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎంసీఆర్హెచ్ఆర్డీ నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు.
ప్రారంభ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. టెక్నికల్ సెషన్స్లో పర్యావరణ పరిరక్షణ, వాలుకాలుష్య నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు చర్చిస్తారన్నారు. ఈ సమావేశంలో ఐఈఐ కార్యదర్శి టి.అంజయ్య, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.